డ్వాక్రా మహిళల భవన నిర్మాణానికి భూమిపూజ.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
-సర్పంచ్ బాలు నాయక్
నర్సింహులపేట, జూలై 2 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో డ్వాక్రా మహిళల కోసం నిర్మించనున్న నూతన భవనానికి గురువారం గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని డ్వాక్రా మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గతంలో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వాల నుంచి తక్కువ మొత్తంలోనే రుణాలు లభించేవని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు అందజేస్తోందని తెలిపారు. మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి, చిన్న తరహా వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, గ్రామంలోని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

