పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు: సీడీపీఓ ఎల్లమ్మ
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆలనా–పాలన, ఆటపాటలతో కూడిన అభ్యాసమే మా బాధ్యత.
నర్సింహులపేట, జూలై 2 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాడి చేశారనే ఆరోపణలపై ప్రచురితమైన నమస్తే న్యూస్ కథనానికి శిశు సంక్షేమ శాఖ స్పందించింది.ఈ ఘటనపై సీడీపీఓ ఎల్లమ్మ వెంటనే విచారణ చేపట్టి, బాధిత బాలుడి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం సంబంధిత అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా, తాను గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ సేవలు అందిస్తూ పిల్లలు, వారి తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి గుర్తింపు పొందానని పేర్కొన్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీడీపీఓ ఎల్లమ్మ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతతో కూడిన సంరక్షణ, ఆటపాటల ద్వారా అభ్యాసం అందించే వేదికలని అన్నారు. పిల్లల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా లేదా హింసాత్మకంగా ప్రవర్తించడం సహించబోమని స్పష్టం చేశారు.విచారణలో నిర్లక్ష్యం లేదా పిల్లలపై అనుచితంగా ప్రవర్తించినట్లు తేలితే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అంగన్వాడీ సిబ్బంది పిల్లలతో ప్రేమగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ తేజ కళ్యాణి, సూపర్వైజర్ మంగదేవి, అంగన్వాడీ టీచర్ కవిత , పిల్లల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

