అంగన్వాడీ పంతులమ్మ క్రమశిక్షణ పేరుతో బాలుడి పై దాడి..?
బాలుడిని చితకబాదినట్లు ఆరోపణలు?
క్రమశిక్షణ పేరుతో అమాయక చిన్నారులపై శారీరక దాడులు?
పంతులమ్మ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.
నర్సింహులపేట, జూలై 2 (నమస్తే న్యూస్)
చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతతో అక్షరాభ్యాసం నేర్పించాల్సిన అంగన్వాడీ టీచర్ ఓ బాలుడిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.కౌంసల్యాదేవిపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్-2లో చదువుతున్న వర్షదీప్ అనే బాలుడిని మంగళవారం భోజన సమయంలో అంగన్వాడీ టీచర్ నీరజ కొట్టినట్లు బాలుడి తండ్రి సంతోష్ ఆరోపించారు.బుధవారం బాలుడికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాల ఆనవాళ్లను నాయనమ్మ పార్వతి గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు అంగన్వాడీ సూపర్వైజర్ మంగాదేవికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా, ఆమె కేంద్రాన్ని సందర్శించి ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిసింది.చిన్నారుల సంరక్షణ, విద్య బాధ్యతలు నిర్వహించాల్సిన అంగన్వాడీ కేంద్రంలోనే ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో అమాయక చిన్నారులపై శారీరక దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

