ఆకేరు వాగులో ఆగని ఇసుక అక్రమ రవాణా.
ఇసుక ట్రాక్టర్ ల రవాణాకు పగిలిపోతున్న నీటి పైపులు.
అడ్డుచెప్పిన రైతులకు ,ఇసుక వ్యాపారుల బెదిరింపులు.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు,పట్టించుకోని అధికారులు.
(నమస్తే న్యూస్,నర్సింహులపేట, డిసెంబర్ 22)
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల ఒత్తిడికి నీటి పైపులు పగిలిపోతున్నాయని, ట్రాక్టర్లను అడ్డుకుపోయిన రైతులను ఇసుక వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో చోటుచేసుకుంది.జయపురం బక్కతండ గ్రామ శివారులోని ఆకేరు వాగు నుండి ఇసుక వ్యాపారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ట్రాక్టర్లు సజావుగా వెళ్లడానికి ఆ పరిధిలో ఉన్న రైతుల పొలాల నుండి తమ ట్రాక్టర్లను నడిపిస్తున్నారు. దీంతో రైతులు తమ పంట పొలాలకు నీటి సరఫరా కొరకు ఏర్పాటు చేసుకున్న పైప్ లైన్ లు పగిలిపోతున్నాయి. ఈ దుశ్చర్యపై నిలదీసిన రైతులను, ఇసుక వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక రైతులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేస్తే ఇసుక నువ్వు అడ్డుకోవడం మా పరిధిలో లేదని, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారని, రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే నిమ్మకు నీరెత్తినట్లుగా ఎలాంటి స్పందన లేదని, స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.కాగా నర్సింహులపేట మండలంలో అధికారులు , ఇసుక మాఫియా అడుగులకు మడుగులోత్తుతున్నారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.రాత్రింబవళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు సుమారు 100 ల ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అధికారుల కనుచూపు మేరలో అక్రమ రవాణా చేస్తున్న ,చూసీ చూడనట్టే వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంట పొలాల మధ్యగా అక్రమ దారులు ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లతో ఇసుక తరలించడంతో, రైతులు లక్షలు ఖర్చు చేసి వేసుకున్న పైపులు పగిలిపోతున్నాయనీ. దీనిపై ప్రశ్నిస్తే రైతులనే బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.అసలే పంటలు సరిగా పండక ,ఆర్థిక ఇబ్బందులతో సతమతవవుతూ ,అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులు ,తమ పంటలను ధ్వంసం చేస్తున్న ఇసుక రవాణాను అడ్డుకోవాలని అధికారులను వేడుకోవడం,అధికారుల అవినీతికి,విధినిర్వహణలో అలసత్వానికి నిదర్శనమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇసుక మాఫియాకు ఎవరి అండదండలు ఉన్నాయి? ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయా? రైతుల భూములు, పంటలు నాశనం అవుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో, ఉన్నతాధికారులు నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాలు,రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రైతులతో ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బందిస్తామని హెచ్చరిస్తున్నారు.


