నమస్తే మానుకోట న్యూస్
సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులతో పాటు నాన్గెజిటెడ్ ఉద్యోగుల పేర్లను కలెక్టర్లు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రధానంగా టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సాంకేతిక సహాయకులు తదితరులపై పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరాలు తెలిపారు. తమ కంటే పైస్థాయి వారినే ప్రత్యేకాధికారులుగా నియమించాలని నల్గొండ తదితర చోట్ల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రభుత్వానికి కలెక్టర్లు లేఖ రాశారు. దీంతో గెజిటెడ్ అధికారులనే ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు సోమవారం జాబితాల్లో మార్పులు చేశారు. టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పేర్లను తొలగించారు. ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, గ్రామీణ నీటిసరఫరా శాఖ(మిషన్ భగీరథ) సహాయ ఇంజినీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవాసంస్థ(ఐసీడీఎస్) సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయాధికారులు, పశువైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యాన శాఖ అధికారులు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఉప తహసీల్దార్ల పేర్లతో జాబితాలను రూపొందించారు.
కొరత ఉన్నచోట
కొన్ని జిల్లాల్లో గెజిటెడ్ అధికారుల కొరత ఉందని ప్రభుత్వానికి కలెక్టర్లు సమాచారం ఇచ్చారు. అక్కడ చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది.


