మరిపెడ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష సామాజిక తనిఖీ.
కారంపురి వెంకటేశ్వర్లు నేత. 7893556455.
డోర్నకల్/మరిపెడ(జూలై 01)నమస్తే న్యూస్.సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సి.ఇ.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో, గాదెగాని అరుణ పర్యవేక్షణలో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మరిపెడలో సమగ్ర శిక్ష సామాజిక తనిఖీ విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల పరిపాలనా రికార్డులు, విడుదలైన వివిధ నిధుల వినియోగం, ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించారు.విద్యార్థుల నమోదు, హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, మరుగుదొడ్ల నిర్వహణ, ఆట స్థలం, గ్రంథాలయ సేవలు,విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, పాఠశాల నిర్వహణ కమిటీల పనితీరు,బోధనోపకరణాల వినియోగం, డిజిటల్ బోధన, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సమగ్రంగా తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేరుగా సమావేశమై పాఠశాల నిర్వహణ, బోధన, సౌకర్యాలు,ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల సేవలపై సామాజిక తనిఖీ బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల సమర్థంగా నిర్వహించబడుతున్నట్లు ప్రశంసించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు పాల్గొన్నారు...

