- ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నైపుణ్య అభివృద్ధికి ప్రోత్సాహం.
- సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రావణి ఆధ్వర్యంలో హ్యాండ్రైటింగ్ నోట్బుక్స్, పెన్సిళ్ల పంపిణీ.
- ముఖ్యఅతిథిగా వంతడుపుల గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్.
నర్సింహులపేట,జూన్ 30 (నమస్తే న్యూస్)ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో అందమైన చేతిరాతతో పాటు చదువుపై మరింత ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రావణి విద్యార్థులకు హ్యాండ్రైటింగ్ నోట్బుక్స్, పెన్సిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థులు ప్రతిరోజూ చక్కటి చేతిరాతతో రాయడం అలవాటు చేసుకోవాలని, అందమైన చేతిరాత విద్యార్థుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. చదువులో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడంలో కూడా హ్యాండ్రైటింగ్ సాధన ఉపయోగపడుతుందని సూచించారు.కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా సామగ్రిని అందించిన శ్రావణి మేడమ్ను అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మాలోత్ యాకూబ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రాంతి కుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. నోట్బుక్స్, పెన్సిళ్లు అందుకున్న విద్యార్థులు శ్రావణి మేడమ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

