రెండవ దశ ప్రచారం ముగింపు… గ్రామాల్లో ఏరులై పారనున్న మద్యం
(నమస్తే న్యూస్ డెస్క్, డిసెంబర్ 12,మహబూబాబాద్)
నర్సింహులపేట మండలంలో స్థానిక సంస్థల రెండవ దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండగా, పల్లెల్లో రాజకీయ వేడి కంటే మద్యం పంపిణీ మరింత పెరిగింది.
భారీగా డంప్ చేసిన మధ్య నిల్వలు
గత కొన్ని రోజులుగా ఎన్నికల దృష్ట్యా, ఏజెన్సీలకు తెలియకుండా గ్రామాల చుట్టుపక్కల భారీగా మద్యం నిల్వలు డంప్ చేసినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో అయితే ఇళ్ల వెనకాల,వృద్ధుల ఇండ్లు, పాడుబడ్డ షెడ్లలో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఏరులై పారనున్న మద్యం
ప్రచారం ముగిసిన నేడు–రేపు, ఆ నిల్వలన్నీ ఏరులా పారనున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కొందరు అభ్యర్థులు, వారి అనుచరులు రాత్రి వేళల్లోనే పంపిణీకి సిద్ధమవుతున్నారు.
సిండికేట్’ గా మారిన మద్యం వ్యాపారులు
ఈ అవకాశాన్ని అదునుగా భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్ ను ఏర్పాటు చేసుకుని భారీగా లాభాలు పొందే ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామాల్లో కొందరు వ్యాపారులు అక్రమంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాన్యులపై అధిక వసూళ్లు
సాధారణ ప్రజలకు మాత్రం ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా వసూలు జరుగుతోంది. “ఎన్నికల రద్దీలో రేట్లు పెరిగాయి” అని చెప్పి, కొన్ని చోట్ల ఫుల్ బాటిల్కు ₹80–₹120 వరకు అదనంగా పడుతోందని వినికిడి.
హోల్సేల్–రిటైల్ కౌంటర్లతో బెల్ట్ షాపులకు అమ్మకాలు
వైన్స్ షాప్ లో హోల్సేల్, రిటైల్ అంటూ కౌంటర్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున సరఫరా కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే ఉన్న బెల్ట్ షాపులు తెరవెనుక మరింత యాక్టివ్ అయ్యాయి.
యువతనే టార్గెట్
రాజకీయ లాభాల దృష్ట్యా, యువతనే ప్రధాన టార్గెట్ గా మద్యం పంపిణీ జరుగుతోంది. జట్లుగా తిరుగుతూ యువకులను ఆకర్షించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
ఇంత జరుగుతున్నా… ప్రాంతీయ ఎక్సైజ్, పోలీసు అధికారులు మాత్రం కన్నెత్తి చూడట్లేదు. ఫీల్డ్లో చెక్కింగ్ డ్రైవులు తగ్గడం, రాత్రివేళలలో పూర్తిగా మౌనం పాటించడం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది.

