మంచ్యతండలో భూభారతి రీసర్వే కార్యక్రమం
కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ సదస్సు నిర్వహణ
కలెక్టర్ సూచనల మేరకు రీసర్వే కార్యక్రమం ప్రారంభం.
భూ రికార్డుల ఖచ్చితత్వమే లక్ష్యం...తహసీల్దార్ కిరణ్ కుమార్.
చిన్నగూడూరు, జూలై 1(నమస్తే న్యూస్)జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఐఏఎస్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు చిన్నగూడూరు మండలం మంచ్యతండ గ్రామ రైతు వేదికలో బుధవారం భూభారతి భూముల రీసర్వే కార్యక్రమం, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డులలో పారదర్శకత, ఖచ్చితత్వం సాధించేందుకు భూభారతి రీసర్వేను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. భూముల రికార్డులు స్పష్టతతో నమోదు కావడంతో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రీసర్వే ప్రక్రియలో రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తదితర భూ సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచి సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలు ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. రీసర్వే పూర్తైన అనంతరం భూ రికార్డులు మరింత కచ్చితత్వంతో అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్తులో భూ లావాదేవీలు, వారసత్వ మార్పులు, ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తహసీల్దార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో భూభారతి రీసర్వేను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాములు, వ్యవసాయ అధికారి భాస్కర్, రెవెన్యూ సిబ్బంది, సర్వే సిబ్బంది, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

