- గిరిజన తండా నుంచి హిమగిరుల దాకా.
- సాహస వీరుడు యశ్వంత్కు దేశవ్యాప్త ప్రశంసల వెల్లువ.
- సాహాసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణం.
- గోవా సీఎం ఘన సన్మానం.
డోర్నకల్/మరిపెడ (జులై 02)నమస్తే న్యూస్.
మారుమూల తండా నుంచి మంచుకొండల శిఖరాగ్రం దాకా...ఇది మహబూబాబాద్ ముద్దుబిడ్డ భూక్యా యశ్వంత్ నాయక్ సాహస గాథ.లడఖ్లోని రెండు దుర్గమ హిమశిఖరాలను జయించి,మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి తెలంగాణ కీర్తి పతాకాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్లిన యువ కెరటం యశ్వంత్కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యశ్వంత్ సాధించిన అసమాన సాహసాన్ని గుర్తించిన గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ స్వయంగా తన అధికారిక నివాసానికి ఆహ్వానించి,శాలువాతో ఘనంగా సత్కరించారు.మరిపెడ మండలం భూక్యా తండా నుంచి వచ్చిన ఈ యువ సింహం తెగువను సీఎం మనసారా కొనియాడారు.ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,ప్రముఖులు యశ్వంత్ను అభినందిస్తూ సందేశాలు పంపడం విశేషం.
మైనస్ 30 డిగ్రీల గడ్డకట్టే చలి,ఊపిరి సలపనివ్వని పలుచని గాలి,అడుగడుగునా హిమపాతాలు...వెన్నెంటే ప్రతి క్షణం వెంటాడే చలి,అలాంటి లడఖ్ మంచు శిఖరాలను యశ్వంత్ అలవోకగా అధిరోహించిన తీరును సీఎంకు వివరించాడు.కాళ్లు,చేతులు కొంకర్లు పోయినా,లక్ష్యం మాత్రం చెదరలేదు.మన జాతీయ జెండాను శిఖరంపై ఎగరేయాలన్నదే నా ధ్యేయం అని యశ్వంత్ చెప్పగానే సీఎం చప్పట్లు కొట్టి అభినందించారు. యశ్వంత్ లాంటి యువకులే నేటి భారతానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు.తండా బిడ్డ అయ్యుండి హిమాలయాలను జయించడం మామూలు విషయం కాదు.ఇలాంటి ఎన్నో ఎవరెస్టులను అధిరోహించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటాలి అని డా.ప్రమోద్ సావంత్ ఆకాంక్షించారు.
ఇది నా ఒక్కడి విజయం కాదు.నన్ను కన్న తండాకు,పెంచిన మహబూబాబాద్ జిల్లాకు,నా తెలంగాణకు దక్కిన గౌరవం.ఇప్పటికే 7 రాష్ట్రాల్లో 15కు పైగా సాహసయాత్రలు చేశాను.గోవా సీఎం చేతుల మీదుగా సన్మానం నా బాధ్యతను మరింత పెంచింది.వచ్చే ఏడాది సెవెన్ సమ్మిట్స్ లక్ష్యంగా పెట్టుకున్నా.భారత్ మాతాకీ జై అని శిఖరాలపై నినదిస్తా అని యశ్వంత్ నాయక్ ఉద్వేగంతో ప్రకటించాడు.అవకాశాలు అందని తండా నుంచి వచ్చి,ఆకాశమే హద్దుగా ఎదిగిన యశ్వంత్ ప్రస్థానం లక్షలాది మంది యువతకు కొండంత స్ఫూర్తి.


