తాగునీటి పైపుల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ బాలు నాయక్
నర్సింహులపేట, జూన్ 17(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో పైపుల మరమ్మతు పనులు చేపట్టారు.వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా ఉండేందుకు పైపులైన్లను పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు చేయిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ కార్మికులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలు నాయక్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తాగునీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గ్రామ ప్రజల సహకారంతో వంతడుపులను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.


