- పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సర్పంచ్ పెదమాముల యాకయ్య
- మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టిన గ్రామ సర్పంచ్.
నర్సింహులపేట, జూన్ 5 (నమస్తే న్యూస్)
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమైందన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.మొక్కలు ప్రాణవాయువును అందించడమే కాకుండా భూగర్భ జలాల పరిరక్షణ, ఉష్ణోగ్రతల నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామ ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసాయా,పంచాయతీ సెక్రటరీ బండి అశోక్, వార్డు సభ్యుడు దూర శ్రీపాల్, భూక్య శ్రీను, షేర్ గోపి, ఏరానాగి వెంకన్న, లెక్కల సంపత్, సిబ్బంది మంగమ్మ, నరేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


