ఆకేరు వాగు ఇసుక రీచ్లపై అధికారుల ఆకస్మిక తనిఖీలు.
నర్సింహులపేట, జూన్ 19 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని ఆకేరు వాగులో నిర్వహిస్తున్న ఇసుక రీచ్లను శుక్రవారం రెవెన్యూ, పోలీసు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఇసుక తవ్వకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.తొర్రూరు ఆర్డీవో, సీఐ, గనులు & భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు, నర్సింహులపేట తహసీల్దార్, ఎస్సై ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇసుక తవ్వకాల నిర్వహణ, అనుమతుల ప్రకారం కార్యకలాపాల అమలు, స్టాక్ నిర్వహణ, రవాణా విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.అదేవిధంగా రీచ్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు, అనుమతులకు విరుద్ధంగా ఇసుక రవాణా చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టాలని నిర్వాహకులకు సూచించిన అధికారులు, ఆకేరు వాగు పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తిగా అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ తనిఖీలు స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


