- వర్షాకాల విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
- నర్సింహులపేటలో అధికారులతో ప్రత్యేక అవగాహన సమావేశం.
- విపత్తులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
నర్సింహులపేట, జూన్ 20 (నమస్తే న్యూస్)
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంభవించే ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ మేరకు నర్సింహులపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వరదలు, నీటి నిల్వలు, అంటువ్యాధుల వ్యాప్తి వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మురుగు నీటి నిల్వలు, చెత్త పేరుకుపోవడం, దోమల వ్యాప్తి వంటి సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు.అలాగే ప్రతి శాఖ తమ పరిధిలో విపత్తుల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పలు సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, మండల వ్యవసాయ శాఖాధికారి వినయ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రావణ్, వైద్య శాఖ ఎం ఎల్ హెచ్ పి అన్వేష్, ఐసీడీఎస్ శ్రీదేవి, మంగాదేవి,పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్ మంజీలాల్, ఇరిగేషన్, ఐకేపీ,విద్యుత్ శాఖ అధికారులు, మండలంలోని సర్పంచులు పెద్దమాముల యాకయ్య, బాలు నాయక్,శ్రీనివాస్ రెడ్డి, దారెల్లి రాధిక, పుప్పాల రవీందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


