మూలమర్రి తండ ప్రజలపై ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి: సర్పంచ్ జానకి రాములు నాయక్
డోర్నకల్/మరిపెడ, జూన్ 20 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రి తండలో ముత్యాలమ్మ తల్లి గుడి 7వ వార్షికోత్సవ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా జానకి రాములు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తండా గ్రామదేవతగా వెలసిన ముత్యాలమ్మ తల్లిని భక్తులు ఆపదలో ఆదుకునే అమ్మవారిగా కొలుస్తూ తమ కోరికలను ఆమె ముందు వినిపించారు.ఈ సందర్భంగా తండా ప్రజలు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. మూలమర్రి తండ ప్రజలపై ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సర్పంచ్ జానకి రాములు నాయక్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తండా మొత్తం పసుపు, కుంకుమలతో పాటు మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో తండా నాయకులు భూక్యా వేంకన్న నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం మూలమర్రి తండ ప్రజల ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలు భక్తి, సంప్రదాయాల నడుమ ఘనంగా జరిగాయి.

