- నీట్-యూజీ–2026 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్.
మహబూబాబాద్, జూన్ 21 (నమస్తే న్యూస్): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ–2026)ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్ష కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, కేంద్రం పరిసరాల్లో అమలు చేస్తున్న భద్రతా వ్యవస్థను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అభ్యర్థులు పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.నీట్-యూజీ–2026 పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.

