- ఎడ్జెర్ల ఎస్సీ కాలనీలో వారాల తరబడి విద్యుత్ నిలిపివేత
- అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం.
డోర్నకల్/మరిపెడ, జూన్ 06 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎడ్జెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం విరిగిపడటంతో గత కొన్ని రోజులుగా కాలనీ మొత్తం చీకటిలో మగ్గుతోంది.వేసవి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరిన ఈ సమయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట విద్యుత్ లేకపోవడంతో ఫ్యాన్లు, లైట్లు పని చేయక పిల్లలు, వృద్ధులు నిద్రపోలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, నివాసితులు వాపోతున్నారు.కాలనీవాసులు ఈ సమస్యను గ్రామ సర్పంచ్కు, విద్యుత్ శాఖ లైన్మెన్కు, అసిస్టెంట్ ఇంజనీర్ (AE)కు పలుమార్లు వివరించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విరిగిన స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు చేసి ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని నివాసితులు కోరుతున్నారు.

