ఆకాశమే హద్దుగా రైతన్న ఎదురుచూపు: ఒక్క చినుకు చాలు విధి రాత మార్చేందుకు!
దుక్కిలో నాగలి.. గుండెలో ఆశ: వరుణుడి అడుగు కోసం అన్నదాత ఉత్కంఠ.
మబ్బు తునకే ప్రాణం: వాన పడితేనే బతుకు పండుతుందంటున్న రైతన్న.
డోర్నకల్/మరిపెడ(జూన్ 4)నమస్తే న్యూస్: ఖరీఫ్ రణక్షేత్రానికి రైతన్న సై అంటున్నాడు! దుక్కి దున్ని,విత్తనం పిడికిట బిగించి,రక్తం చెమటగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇప్పుడు కావాల్సింది ఒక్కటే - ఆకాశం నుంచి వరుణుడి జల్లు!
ఉత్కంఠలో పొలం...
బీడు వారిన భూమి నోరు తెరిచి వాన చుక్క కోసం తపిస్తోంది."ఒక్క వాన మా పొలంపై పడితే చాలు,ఈ నేల బంగారమవుతుంది.ఒక్క జల్లు కురిస్తే చాలు,మా ఇంట సిరులు పండుతాయి" అంటూ అన్నదాతల గుండె చప్పుడు వినిపిస్తోంది.
వరుణుడే దిక్కు...
గింజ నేలలో పడి మొక్కై,మొక్క,చేను,చేను కుటుంబానికి కూడు పెట్టాలంటే - అది కేవలం వరుణుడి దయ వల్లే సాధ్యం!ప్రతి రైతు గుండె ఇప్పుడు నల్లటి మబ్బు కోసమే కొట్టుకుంటోంది.ఆ మబ్బు చూపు పడితే చాలు,రైతు బతుకు చిగురిస్తుంది.
యుద్ధానికి సిద్ధం..
విత్తనం,ఎరువు,కష్టం - అన్నీ సిద్ధం.ఇక వాన పడిందంటే చాలు,పొలం యుద్ధరంగంలోకి దిగుతాడు రైతు.రుతుపవనాలు త్వరలోనే తలుపు తడతాయన్న ఆశతో కోటి కళ్లతో ఎదురుచూస్తున్నాడు,మేఘమాల కదలాలి,వరుణుడు కరుణించాలి,ఈసారి రైతన్న చెమట చుక్క వృథా కాకూడదు!..

