ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
మరిపెడలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక వార్డు సభలు.
మినీ స్టేడియం, గ్రంథాలయానికి వినతి పత్రం అందజేసిన యువకులు.
డోర్నకల్/మరిపెడ, జూన్ 10 (నమస్తే న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం మరిపెడ పట్టణంలోని 13, 14, 15వ వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే వార్డు సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఏఈఓ అరవింద్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదల, సీజనల్ పంటలకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి అంశాలను వివరించారు. రైతులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.విద్యుత్ శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న లో-వోల్టేజ్ సమస్యల పరిష్కారం, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు, కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఇదిలా ఉండగా, 14వ వార్డులో జరిగిన సభలో సన్రైజ్ స్ట్రైక్ క్రికెట్ క్లబ్ సభ్యులు ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ క్రీడా మైదానం లేకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. పోలీస్ శిక్షణకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, క్రీడాకారులు, వాకర్స్, యువత, చిన్నారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి, జాటోతు సురేష్, జియో రమేష్, గంట్ల గౌతమ్ రెడ్డి, మెరుగు రాము, తిరుపతితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాషిపంగు రవికాంత్, వెర్మరెడ్డి వెంకట్ రెడ్డి, యాకన్న, వాంకుడోతు వీరన్న, అన్వేష్, ఇద్దయ్య, నరేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు బోడ రవి, అశోక్, దసరా, హరీష్, అన్వేష్, వెంకన్న, అంగన్వాడీ సిబ్బంది, ఆర్పీలు తదితరులు హాజరయ్యారు.వార్డు సభల్లో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అందిన వినతులు, దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఛైర్పర్సన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.


