- ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సర్పంచ్ బాలు నాయక్
- గ్రామసభలో అభివృద్ధి, పరిశుభ్రత, నేర నియంత్రణపై అవగాహన.
నర్సింహులపేట, జూన్ 10 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో బుధవారం సర్పంచ్ బాలు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలు నాయక్ మాట్లాడుతూ, "మన గ్రామం – మన అభివృద్ధి" అనే నినాదంతో ప్రతి గ్రామస్తుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో వంతడుపుల గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రాధిక మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం ఎస్సై బానోత్ వెంకన్న మాట్లాడుతూ, మండలాన్ని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. అక్రమ గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ, నల్ల బెల్లం వ్యాపారం, అక్రమ ఇసుక రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.గ్రామసభలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత,సామాజిక బాధ్యతల విషయంలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని పలువురు అభిప్రాయపడ్డారు.


