గ్రామసభలో వార్డు సభ్యుడిని వేదికపై కూర్చోబెట్టని అధికారులు.
నర్సింహులపేట, జూన్ 6 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ప్రోటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని 1వ వార్డు సభ్యుడు మందుల రామ్మూర్తికి సభలో తగిన స్థానం కల్పించకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వార్డు సభ్యుడు మందుల రామ్మూర్తి గ్రామసభలో ముందువరుసలో కూర్చోవాల్సి ఉండగా, ఆయన వెనుక వరుసలో కూర్చున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై గ్రామ ప్రజలు, పలువురు సామాజిక వర్గాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రజాప్రతినిధులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై, గ్రామపంచాయతీ పాలకవర్గంపై ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా దళిత వార్డు సభ్యుడికి తగిన గౌరవం దక్కకపోవడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

