- పెదనాగారం స్టేజ్ వద్ద ప్రజా బాట కార్యక్రమం విజయవంతం.
- నూతన 15 కేవీఏ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం.
నర్సింహులపేట, జూన్ 7 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని పెదనాగారం స్టేజ్ వద్ద టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఏఈ పాండు హాజరై గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన నూతన 15 కేవీఏ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఈ పాండు మాట్లాడుతూ, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, గృహ అవసరాల కోసం ఐఎస్ఐ మార్కు కలిగిన మోటార్లు, స్టార్టర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.ప్రజలకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే ప్రజా బాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

