యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించిన యువకుడి అరెస్టు.
డోర్నకల్/మరిపెడ(జూన్ 22)నమస్తే న్యూస్.
ఇన్స్టాగ్రామ్లో మారు పేర్లతో అకౌంట్లు తెరిచి యువతి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడిన యువకుడిని మరిపెడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన కాంచనపల్లి జోసెఫ్ మరిపెడ గ్రామానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని గత కొద్దిరోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో మారు అకౌంట్లు సృష్టించి ఆ యువతి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాకుండా బ్లాక్మెయిల్కు పాల్పడుతూ యువతిని మానసికంగా వేధింపులకు గురి చేశాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు కాంచనపల్లి జోసెఫ్ పై ఐటీ యాక్ట్ కింద పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి ఈరోజు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ మహిళల వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించడం తీవ్ర నేరమని హెచ్చరించారు. ప్రేమ పేరుతో మహిళలను వేధించడం, వారి ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా షేర్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వేధింపులకు గురైన మహిళలు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని యువతకు సూచించారు.

