- మేము సైతం గంజాయి నిర్ములనకై కృషిచేస్తాం. వాల్ అఫ్ ప్రామిస్ ఫ్రేమ్ లో సంతకాలు చేసిన గ్రామ యువత.
- బోడ్లాడ గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
- గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.
దంతాలపల్లి,జూన్ 23(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ పరిధిలోని బోడ్లాడ గ్రామంలో నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొన్నారు. గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని వివరించారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రత్యేకంగా EAGLE ఫోర్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామ భద్రతలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపు, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. సీసీ కెమెరాల నిఘా ద్వారా గ్రామంలో భద్రత మరింత బలోపేతం అవుతుందని, ప్రతి గ్రామం సీసీ కెమెరాల రక్షణలో ఉండేలా ప్రజలు సహకరించాలని కోరారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ను తప్పనిసరిగా ధరిస్తామని, గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిజ్ఞ పత్రంపై సంతకాలు చేశారు.గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు గ్రామ ప్రజలు కలిసి "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండటం సంతోషకరమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలకు ప్రజలు నిరంతరం సహకరించాలని కోరారు.గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేయబడుతుందని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొంటూ, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్కు తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






