- మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన.
నర్సింహులపేట, జూన్ 22 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింహులపేట ఎస్సై వెంకన్న, పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు వాటి దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించారు.


