- అర్ధరాత్రి బైక్పై ఎస్పీ గస్తీ.
- గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు
- మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.
- డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా,గాంజా బాధిత యువతకు చికిత్స.
- ఎస్పీ నిబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు.
మహబూబాబాద్,మే31(నమస్తే న్యూస్):జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ అర్ధరాత్రి వేళల్లో స్వయంగా బైక్పై గస్తీ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిస్థితిని పరిశీలించారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, చెట్ల పొదలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, పార్కులు, విద్యాసంస్థల సమీప ప్రాంతాలు, యువకులు గుమిగూడే ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి వినియోగం, విక్రయాలపై ప్రత్యేకంగా ఆరా తీసి అనుమానితుల కదలికలను గమనించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని స్థాయిల్లో కఠిన చర్యలు చేపడుతోందన్నారు.కేవలం కేసులు నమోదు చేయడానికే పరిమితం కాకుండా, గంజాయికి బానిసైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స, కౌన్సెలింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.ప్రత్యేక కిట్ల సహాయంతో అనుమానితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించి గంజాయి వినియోగాన్ని గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా తేలిన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి డీ-అడిక్షన్ సెంటర్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.గంజాయి అలవాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు జిల్లా పోలీసు హెల్ప్లైన్ 8712656999 ను సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రత్యేక తనిఖీల్లో డీఎస్పీ తిరుపతి రావు, సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై శివరామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


