శ్రీవెంకటేశ్వర రైస్ మిల్పై ఆకస్మిక తనిఖీలు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న బస్తాలను మిల్లర్లకు తరలింపుపై అధికారుల నిఘా.
నర్సింహులపేట, 16 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెదనాగారం స్టేజి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ధాన్యం రైస్ మిల్ను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను మిల్లర్ల వద్దకు చేర్చే ప్రక్రియపై వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.తహసీల్దార్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆర్ఐ అఖిల్, పీఎస్సీఎస్ సీఈఓ వెంకన్న పాల్గొన్నారు. రైస్ మిల్లో నిల్వ ఉంచిన ధాన్యం వివరాలు, కొనుగోలు రికార్డులు, రవాణా పత్రాలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం నిల్వలు, తరలింపులు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమ నిల్వలు లేదా అనుమతి లేకుండా ధాన్యం రవాణా జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.

