అనుమతులు లేకుండా రాస్తారోకో చేస్తే చర్యలు తప్పవు
: ఎస్సై భానోత్ వెంకన్న
నర్సింహులపేట, 16 మే (నమస్తే న్యూస్) :
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి వద్ద ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదనాగారం గ్రామానికి చెందిన కొంతమంది భారత్ గ్యాస్ వినియోగదారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న నర్సింహులపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్కు కారణమవడం నేపథ్యంలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట సబ్ ఇన్స్పెక్టర్ భానోత్ వెంకన్న తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్య హక్కేనని, అయితే చట్టాన్ని ఉల్లంఘిస్తూ రహదారులపై అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను శాంతియుతంగా, చట్టబద్ధంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

