పోలీస్ స్టేషన్ ముందే యథేచ్ఛగా ఇసుక రవాణా..?
నర్సింహులపేట, 16 మే (నమస్తే న్యూస్):
నర్సింహులపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుటుగానే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపులు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఆకేరువాగు పరిధిలోని జయపురం, కౌసల్యదేవిపల్లి, బక్కతండా ప్రాంతాల నుంచి భారీగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టాక్స్ పేరుతో బహిరంగ వసూళ్లు జరుగుతున్నాయంటూ ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.ఇప్పటికే ప్రజాప్రతినిధులు హెచ్చరించినా అక్రమ దందా ఆగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రింబవళ్లు ట్రాక్టర్ల రాకపోకలతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఆదాయం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

