పంట వ్యర్థాలు కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం:ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు నూటికి నూరు శాతం పూర్తి చేయాలి:పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ధాన్యం రవాణా, లారీల కొరత తక్షణమే పరిష్కరించాలి:మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్,మే 24 (నమస్తే న్యూస్ )
పంట వ్యర్థాలు కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం కీలక హెచ్చరికలు జారీ చేశారు. పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడమే కాదు అగ్ని ప్రమాదాలకూ దారితీస్తుందని స్పష్టం చేశారు. రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు ప్రతి గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అయినా పంట వ్యర్థాలు కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు నూటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గతంలో నెలల తరబడి పెండింగ్లో ఉండిన చెల్లింపులు ఇప్పుడు గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని పేర్కొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంత్రివర్గం ఆమోదించిన సన్ఫ్లవర్ కొనుగోళ్లకు వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. చివరి గింజ వరకూ కొనుగోలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.మహిళా సంక్షేమ వారోత్సవాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ మే 25 నుంచి 30 వరకు అంగన్వాడీ, రుణ మేళా, సౌర విద్యుత్, బాల్య వివాహాల నిరోధం వంటి కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ స్థానిక అధికారులకు ధాన్యం రవాణా, లారీల కొరత తక్షణమే పరిష్కరించాలని, 211 వీఓ బిల్డింగ్ల మార్కింగ్ 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

