నమస్తే న్యూస్ వరుస కథనాలతో ఆకేరు వాగులో అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ ఆగ్రహం..?
నర్సింహులపేట, 19 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరుగుతున్న అక్రమ వసూళ్లపై నమస్తే న్యూస్ పత్రికలో వెలువడిన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ స్నేహ శబరిష్ స్పందించారు.మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఈ అంశంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“మండల కేంద్రంలో బహిరంగంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారు?” అంటూ అధికారులను నిలదీశారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలింపు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించినట్లు సమాచారం.ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

