కొనుగోలు కేంద్రాల్లో రైతుల పట్ల నిర్లక్ష్యం సహించం జిల్లా కలెక్టర్ డాక్టర్ స్నేహ శబరిష్.
నర్సింహులపేట,19 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మక్క, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రక్ షీట్ వివరాలపై సరైన సమాచారం అందించకపోవడంతో నర్సింహులపేట కొనుగోలు కేంద్రంలోని సీఈఓ వెంకన్న, ఏఈఓ మౌనికలకు, అలాగే వస్త్రం తండా కొనుగోలు కేంద్రంలోని ప్రసాద్, రమేష్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని తెలిపారు.కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


