వడదెబ్బతో యువ రైతు మృతి.. బాలాజీపేటలో విషాదం.
బయ్యారం, మే 31 (నమస్తే న్యూస్):వడదెబ్బ కారణంగా ఓ యువరైతు మృతి చెందిన విషాద ఘటన బయ్యారం మండలం బాలాజీపేటలో చోటుచేసుకుంది.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీపేట గ్రామానికి చెందిన కొత్త చంద్రశేఖర్ (27) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో పంట వ్యర్థాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాడు. తీవ్ర ఎండలో గంటల పాటు పనిచేసిన అనంతరం సాయంత్రం ఇంటికి చేరుకున్న చంద్రశేఖర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయాడు.వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. వడదెబ్బ కారణంగానే చంద్రశేఖర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.ఆదివారం మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులను గ్రామస్తులు పరామర్శించి సానుభూతి తెలిపారు.

