"ధాన్యం కొనండి సారు” అంటూ ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టిన అన్నదాతలు.
నర్సింహులపేట,19 మే(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రం తండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మండలంలోని పెద్దనాగారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులకు గన్నీ సంచులు ఇవ్వకుండా గత నెలరోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని,సోమవారం వచ్చినటువంటి గన్నీ సంచులను కూడా మాయం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని 40 రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో కడుపు మండిన రైతన్నలు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.ఇక్కడే తిండి… ఇక్కడే నిద్ర… పొద్దంతా కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని,అప్పుల భారం ఒకవైపు, వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందనే భయం మరోవైపు వెంటాడుతుందని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెలకుపైగా గడిచినా కనీసం ధాన్యం తూకం వేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రైతులు ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

