ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి. -- ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.
నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్.
నర్సింహులపేట,06(నమస్తే న్యూస్)
గ్రామాల్లో నేర నివారణ చర్యలను బలోపేతం చేయాలని, జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీసులకు సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ నర్సింహులపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు మరియు విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకొని, ప్రతి పోలీస్ సిబ్బంది విధి సమయాల్లో తప్పనిసరిగా స్టేషన్లో అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎప్పుడూ సులభంగా చేరుకునే విధంగా సేవలు అందించాలని సూచించారు.అదేవిధంగా పెండింగ్ కేసులపై వేగవంతమైన చర్యలు తీసుకుని విచారణను నాణ్యతతో పూర్తి చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు. బీట్ వ్యవస్థను కచ్చితంగా అమలు చేస్తూ గ్రామాల్లో నేర నివారణ చర్యలను బలోపేతం చేయాలని, సీసీటీవీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచడంతో పాటు మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై బి. వెంకన్న, మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



