ఉపాధి కూలీల ఆకలి కేకలు...వేతనాలు అందక ఇబ్బందులు
ఉపాధి కూలీలకు ఆరు వారాలుగా అందని కూలి వేతనం.
ఆరు వారాలు నుంచి డబ్బు ఇవ్వలేదు అధికారులను నిలదీసిన...మహిళా కూలీలు.
నర్సింహులపేట, మే 5 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని చిత్తుకుంట గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఆరు వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించిన వార్డ్ మెంబర్ ఎస్.కె. హసీనా, అధికారులను నిలదీశారు.కూలీలు మాట్లాడుతూ, రోజంతా కష్టపడి పని చేసినా రూ.250–300 మాత్రమే వస్తోందని, అది కూడా వారాల తరబడి ఆలస్యం అవుతోందని తెలిపారు. వ్యవసాయ సీజన్ ముగియడంతో ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నామని, వేతనాలు సమయానికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఎస్.కె. హసీనా మాట్లాడుతూ, ఐదు నుండి ఆరు వారాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి వారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పని దినాలు మరియు కూలి రేట్లు పెంచాలని కోరారు. అలాగే పని ప్రదేశాల్లో రోజుకు రెండు సార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.కూలీల సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో భోగి యాదమ్మ, చామకూరి పూలమ్మ తదితర మహిళా కూలీలు పాల్గొన్నారు.


