ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య
తొర్రూరులో తీవ్ర విషాదం.
(నమస్తే న్యూస్,తొర్రూరు, ఏప్రిల్28 )
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి చంపి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (35) అనే వ్యక్తి, తన ఇద్దరు కుమారులు విలాష్ (5), వికేష్ (3) లతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తొర్రూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఉన్న కాలీఫ్లవర్ పొలంలో వేప చెట్టుకు ఇద్దరు పిల్లలను ముందుగా ఉరివేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను కిందికి దించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక దర్యాప్తులో కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడి భార్యతో పాటు ఒక కుమార్తె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో అమ్మాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతితో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

