ఇంటి వద్దకే పోలీస్ సేవలు.
దాడికి గురైన బాధితులకు అండగా కురవి పోలీసులు.

(నమస్తే న్యూస్, కురవి, మార్చి 26)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. రాజోలు గ్రామానికి చెందిన కొమ్మరాజుల వీరభద్రమ్మ (60)పై,అదే నివాస ప్రాంతానికి చెందిన గుంజ రాజు, గుంజ యశోద, వారి కుమారుడు సురేష్, ఆటో పార్కింగ్ విషయంలో గొడవపడి దాడికి పాల్పడిన ఘటనలో, బాధితురాలు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనలో కురవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ స్పందించిన తీరు స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని, బాధితురాలి పరిస్థితిని పరిశీలించారు. వయస్సు, గాయాల తీవ్రత దృష్ట్యా ఆమెను పోలీస్ స్టేషన్కు రప్పించకుండా, బాధితురాలి ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం ద్వారా స్నేహపూర్వక పోలీసింగ్ను ఆచరణలో చూపించారు.అనంతరం నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, బాధితులకు భరోసా కల్పించాలి అనే లక్ష్యంతో ఎస్ఐ సతీష్ తీసుకున్న ఈ చర్య స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు వంటి బలహీన వర్గాల పట్ల సున్నితంగా వ్యవహరించడం పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తోంది.
ఇలాంటి సానుకూల చర్యలు ప్రజలు మరియు పోలీసుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని, తద్వారా శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించవచ్చునని,అన్యాయానికి గురైనా వారిలో,తమకు పోలీసులు రక్షణకల్పిస్తారనే బరోసా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
