క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: డాక్టర్ విజయ్ కుమార్
NAMASTHE NEWSMarch 24, 2026
0
క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
-డాక్టర్ విజయ్ కుమార్
(నమస్తే న్యూస్,మహబూబాబాద్,మార్చి 24):
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక అంటు వ్యాధిగా భావించే క్షయవ్యాధి (TB) నిర్మూలనపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 24ను ప్రపంచ టిబి దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా టీబి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. 2026 సంవత్సరానికి “అవును! మనం క్షయను అంతం చేయగలం” అనే నినాదంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అర్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, టిబి ప్రధానంగా గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధి అని, ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని వివరించారు. రోగులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వ్యాధి ఇతరులకు సోకే అవకాశముందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.ప్రభుత్వం చేపట్టిన “టిబి ముక్త్ భారత్ అభియాన్” ద్వారా జిల్లాలో అధిక ప్రమాదం ఉన్న 69 గ్రామాలు, వార్డుల్లో స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిక్షయ్ పోషణ యోజన కింద రోగులకు ప్రతినెల రూ.1000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ ఎక్స్-రే, ఏఐ సాంకేతికతతో ముందస్తు నిర్ధారణ, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, టిబి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు.