- నేర నియంత్రణలో ప్రతిభకు గుర్తింపు.
- జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేతుల మీదుగా ఎస్సై బానోతు వెంకన్నకు రివార్డు.
- నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న ను అభినందించిన జిల్లా పోలీస్ బాస్.
నర్సింహులపేట, జూన్ 8 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ఎస్సై బానోతు వెంకన్నకు ప్రత్యేక గుర్తింపు లభించింది. జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ చేతుల మీదుగా ఎస్సై వెంకన్న రివార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో పోలీసు సిబ్బంది సమిష్టి కృషి, ప్రజల సహకారం కీలక పాత్ర పోషించాయని అన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, శాంతిభద్రతలను కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తూనే, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ రివార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.పోలీసు శాఖలో ఉత్తమ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ రివార్డు పట్ల సహచర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఎస్సై వెంకన్నను అభినందించారు.

