- దంతాలపల్లి మండలంలో రైతు కూలీల ఆందోళన.
- తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన రైతులు మరియు నాయకులు.
దంతాలపల్లి ,జూన్ 15 (నమస్తే న్యూస్)
దంతాలపల్లి మండలంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. కల్తీ విత్తనాల దందా నుండి రుణ మాఫీ వరకు పలు కీలకమైన సమస్యలపై నాయకులు పదునైన స్వరంతో మాట్లాడారు.భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్-లెనినిస్ట్ న్యూడెమోక్రసీ తొర్రూరు విభాగ కార్యదర్శి ఊడుగుల లింగన్న మాట్లాడుతూ "అధికారులు నకిలీ విత్తనాలు, పురుగు మందులు పట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ నేరస్తులపై చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల రైతులు ప్రతి సీజన్లోనూ మోసపోతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ వ్యాపారులపై ప్రజా భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అఖిల భారత రైతు కూలీ సంఘం తొర్రూరు విభాగ అధ్యక్షులు చిర్ర యాకన్న మాట్లాడుతూ "రైతులు పాత రుణాల భారంతో కుప్పకూలిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే రుణ మాఫీ ప్రకటించి, రోల్ ఆన్ పద్ధతిలో కొత్త రుణాలు అందించాలి. ఆలస్యం అంటే మరో రైతు మరణం అని అర్థం" అని హెచ్చరించారు.పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఖర్చులు రెట్టింపయ్యాయని, అయినా సరే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి, అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతులు పొలాలు వదిలి పట్టణాలకు వలస పోతారు. అది కేవలం రైతు సంక్షోభం మాత్రమే కాదు దేశ ఆహార భద్రతకే పెద్ద ముప్పు" అని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్కే సాజన్ పషా, వర్రె వెంకన్న, భారతి, సురేష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.

