బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా భానోత్ ప్రభాస్ నాయక్ నియామకం.
నర్సింహులపేట, 23 మే (నమస్తే న్యూస్)
భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన భానోత్ ప్రభాస్ నాయక్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ నియమించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ఆగాపేట మేఘ్య తండాకు చెందిన ప్రభాస్ నాయక్ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.ప్రభాస్ నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలలో పార్టీ విస్తరణకు ఆయన చేసిన సేవలను పార్టీ రాష్ట్ర నాయకత్వం అభినందించినట్లు సమాచారం.తనను గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల ప్రభాస్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.భానోత్ ప్రభాస్ నాయక్ నియామకంపై డోర్నకల్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

