కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం..?
బీజేపీ పాలనపై కాంగ్రెస్ యువనేత సతీష్ గౌడ్ విమర్శలు.
నర్సింహులపేట, 14 మే (నమస్తే న్యూస్):
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని, ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్ విధానాలు, ప్రలోభాల రాజకీయాలు వంటి అంశాలు బీజేపీ విజయాలకు కారణమవుతున్నాయని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలను పరిష్కరించకుండా మతపరమైన అంశాలను ముందుకు తెచ్చి సమాజంలో విభజన సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.దేశవ్యాప్తంగా ధరలు పెరిగిపోతున్నా, నిరుద్యోగం అధికమవుతున్నా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రతీ అంశాన్ని భావోద్వేగాలకు మళ్లిస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షకు గంటల ముందే ప్రశ్నపత్రాలు బయటకు రావడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే ఘటన అని అన్నారు. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి కాదు… నిరుద్యోగుల ఆశలను దెబ్బతీయడమేనా?” అంటూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, అలాంటి యువత భవిష్యత్తుతో ఆటలాడటం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల్లో నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలని కోరారు.

