ఆకేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా...!
ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్ళు??
నర్సింహులపేట,18 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.మండలంలోని ఓ అధికారి పేరును ఉపయోగిస్తూ ఓ వ్యక్తి వేలాది రూపాయలు వసూలు చేస్తూ వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా మా కార్యాలయానికి సంబంధించిన అధికారి ట్రాక్టర్ను ఎలా ఆపుతారు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ట్రాక్టర్కు రోజుకు రెండు కూపన్లు మాత్రమే జారీ చేస్తున్నప్పటికీ, వాటికి మించి అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లడంతో పాటు ఆకేరు వాగు సహజ స్వరూపం దెబ్బతింటోందని ప్రజాసంఘాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, కొందరి అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

