దేవుడి మాన్యం భూములకు హద్దు రాళ్లు ఏర్పాటు.
నర్సింహులపేట, మే 12 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ కపిలగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయానికి చెందిన మాన్యం భూములను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించారు. ఈ సందర్భంగా అన్యాక్రాంతానికి గురైన 2 ఎకరాలు 10 గుంటల భూమిని వెలికితీసి, మొత్తం 19 ఎకరాలు 23 గుంటల దేవాలయ భూమికి హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.అదేవిధంగా జయపురం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 4 ఎకరాలు 15 గుంటల భూమిని కూడా సర్వే చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 10 గుంటల భూమి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించి తిరిగి దేవాలయ పరిధిలోకి తీసుకువచ్చి హద్దులను ఖరారు చేశారు.సర్వే ద్వారా నిర్ణయించిన హద్దు రాళ్లను ఎవరైనా తొలగించినా లేదా ధ్వంసం చేసినా దేవాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకురాలు నందనం కవిత, దేవాదాయ శాఖ సర్వేయర్ పసునూరి అనిల్, జూనియర్ అసిస్టెంట్ శేఖర్, ఆర్. అసిస్టెంట్ పవన్, గ్రామస్తులు, దేవాలయ సిబ్బంది, అలాగే యోగానంద లక్ష్మీనర్సింహ స్వామి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.



