ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి : ఎస్సై వెంకన్న.
నర్సింహులపేట, మే 08 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎస్సై భానోత్ వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నిఘా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ధాన్యం రాశుల వద్ద టార్పిన్ కవర్లు మాయం కావడం వంటి సమస్యలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, దళారుల మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగి రైతులకు భరోసా కలిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బందికి సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకే విక్రయించేలా చూడాలని, దళారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు.

