పెట్రోలు బంకుల వద్ద వాహనాల బారులు.
వాహనదారులు,అన్నదాతల పెట్రోల్ అవస్థలు.
మండుటెండలో గంటల తరబడి పడిగాపులు.
పలుచోట్ల ఘర్షణలు.. పోలీసు బందోబస్తు.
నర్సింహులపేట, ఏప్రిల్ 27(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని హిందుస్థాన్ పెట్రోలియం బంకులో డీజిల్,పెట్రోల్ కొరకు వినియోగదారులు,రైతులు బారులు తీరారు.చుట్టుప్రక్కల ఏ బంకులో కూడా పెట్రోల్,డీజిల్ లేకపోవడంతో మండల కేంద్రానికి సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ స్టాక్ లారీ రావడంతో జనం ఒకసారిగా ఎగబడ్డారు.రైతులు ఏంటి క్యాన్లతో వరుసలో నిలబడ్డారు.డీజిల్,పెట్రోల్ నిల్వలు తగ్గిపోవడంతో వ్యవసాయ పనులకు అవసరమైన డీజిల్ అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 100కు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. పలుచోట్ల‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.వందల సంఖ్యలో బంకులు మూతబడటంతో డీజిల్, పెట్రోలు కోసం వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని చోట్ల ఇదే సమస్య కొనసాగుతోంది. తెరిచి ఉంచిన బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరుతున్నాయి.డిమాండ్ తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఆయిల్ కంపెనీలు రేషన్ విధానం పాటిస్తూ బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్, పెట్రోలు సరఫరా చేస్తుండటంతో అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది.ఆ వెంటనే బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు.



