విద్యార్థులతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ.
(నమస్తే న్యూస్, నర్సింహులపేట, ఏప్రిల్ 15):
చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని స్థానిక ఎంఈవో రామ్మామోహన్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రత సందేశాలను ప్రజలకు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ తెలిపారు. రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ సంకేతాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్బెల్ట్ వినియోగం, అధిక వేగం వల్ల జరిగే ప్రమాదాలపై విద్యార్థులకు వివరించారు. చిన్నతనం నుంచే రోడ్డు భద్రత నియమాలను అలవర్చుకుంటే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ర్యాలీలో విద్యార్థులు ప్రత్యేక హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. హెల్మెట్ ధరించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పోలీసులు అభినందించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సమాజ భద్రతకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. “Arrive Alive” కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి అలవాటు పడాలని పోలీసులు పిలుపునిచ్చారు.


