రామన్నపేట, ఆగస్టు 7(నమస్తే న్యూస్) దుబ్బాక గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అలాగే గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డ్రైడే – ఫ్రైడే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ మాట్లాడుతూ, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు అత్యంత శ్రేష్ఠమైన ఆహారమని,ప్రతి తల్లి తన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలనే అందించాలని సూచించారు.తల్లిపాల వల్ల శిశువులకు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని వివరించారు.అనంతరం సర్పంచ్ గట్టు నరసింహ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలోని పలు వీధులను పరిశీలించారు.ఈ సందర్భంగా నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి,దోమల వ్యాప్తిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుండాల రమేష్,పంచాయతీ కార్యదర్శి కవిత,ఆరోగ్య సూపర్వైసర్ గోపాల్,అంగన్వాడీ సిబ్బంది గట్టు సరళ,ఏఎన్ఎం గౌసియా,ఆశా కార్యకర్తలు లక్ష్మి, లత,వినోద, మంగమ్మ, రజిత, గణేష్,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, తల్లులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

