ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలి
ఆర్&బి కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో డీఈ ఖాళీ కుర్చీకి వినతిపత్రాలు ఇచ్చి సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన
రామన్నపేట సెప్టెంబర్ 8(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక–మునిపంపుల గ్రామాల మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు గుంతలను వెంటనే పూడ్చి, ప్రజల సమస్యను పరిష్కరించాలని మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా డిమాండ్ చేశారు. రోడ్డు మరమ్మతుల విషయంలో పలుమార్లు సంబంధిత ఆర్&బి అధికారులను కలిసి విన్నవించినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం వినూత్న నిరసన చేపట్టారు.అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆర్&బి డీఈ ఖాళీ కుర్చీకి వినతిపత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు నిత్యం ప్రయాణించే ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని, ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్డు గుంతలను పూడ్చడంలో ఆర్&బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పాదయాత్ర, ధర్నాలు, వినతి పత్రాలు అందించి నిరసనలు చేసినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు.రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించకపోతే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత ఆర్&బి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు గుండాల నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, వేముల మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


